25-07-2025 07:37:01 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి మండలాల పరిధిలోని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో రాపల్లి కోటలో డ్రై డే పై ప్రజలకు అవగాహన కల్పించినారు. అనంతరం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కళ్యాణి మాట్లాడుతూ గ్రామంలో వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్న వారిని పరిశీలించి, తగిన పరీక్షలు నిర్వహించి, వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ వర్షాకాలంలో ప్రతివారు వేడి చేసి చల్లార్చిన నీటిని వాడాలని, వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.
ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే సమీపంలోని వైద్యునికి, సిబ్బందికి సమాచారం అందించి, వారి సలహా, సూచనలు, సేవలను వినియోగించు కోవాలన్నారు. గుట్కా ,పొగాకు ,సారా మద్యపాన ధూమపానం సేవించరాదని, గ్రామంలోని గర్భిణీ స్త్రీలు ఇంటికి వెళ్లి పరిశీలించి వారికి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. డ్రై డే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇళ్లల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, నీటి కొరకై వాడుకునే పాత్రల లో శుభ్రమైన నీటిని నింపుకోవాలని, ఇంటి పరిసరాల్లో ఖాళీ డబ్బాలు, సీసాలు, త్రాగి పడేసిన కొబ్బరి బోండాలు, కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, వివిధ రకాల చెత్తాతో నిండిన వస్తువులలో నీళ్లు నిలువ లేకుండా చూడాలని గ్రామస్తులను కోరారు.