02-09-2025 12:00:00 AM
కలెక్టర్లు రాహుల్ శర్మ, దివాకర టి.ఎస్
రేగొండ, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో సోమవారం 70 దరఖాస్తులు వచ్చాయని వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖ అధికారులు జాగ్రత్తగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. ప్రజలు చేసిన వినతులను కేవలం నమోదు చేయడం కాకుండా శాశ్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో..
ములుగు, సెప్టెంబర్1(విజయక్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 50దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 09, భూ సమస్యలు 08, ఉపాధి కల్పనకు 05, పెన్షన్ 05, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో..
హనుమకొండ టౌన్ సెప్టెంబర్ 01.(విజయ క్రాంతి):ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్ర మాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ప్రజలు 179 వినతులను అందజేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరగా ఆ సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న జిల్లా అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే ప్రజావాణి కార్యక్రమం నాటికి వినతులను పరిష్కరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, పలు శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.