25-07-2025 06:38:00 PM
నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరి
వర్తక, వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి
జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో గోల్డ్ షాప్స్, బ్యాంకర్స్, ఇతర వర్తక, ఫైనాన్స్ వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఒక సీసీ కెమెరా ఆక్టివ్ గా పని చేస్తే 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని ప్రతి ఒక్క బంగారం దుకాణం, బ్యాంక్, ఎటిఎం ఇతర ఫైనాన్స్ వ్యాపారస్తులు తమ తమ దుకాణాల ముందు కూడా రెండువైపులా సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు. తద్వారా దొంగతనాలు, దోపిడీలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏర్పాటు చేసిన ప్రతి సీసీ కెమెరా నిర్విరామంగా పని చేయాలని అందుకు తగిన నెట్వర్క్, స్టోరేజ్ కెపాసిటీ ఏర్పాటు చేయాలన్నారు. వారితోపాటు ఏఎస్పి రామేశ్వర్, డిఎస్పి శ్రీనివాసులు ఉన్నారు.