20-09-2025 12:06:03 AM
రాజాపూర్, సెప్టెంబర్ 19 : ప్రజల శాంతిభద్రతలే పోలీసుల ప్రధాన కర్తవ్యం అని ఎస్సు శివానంద్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజా భద్రత - పోలీసు బాధ్యత సామాజిక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సురక్ష పోలీస్ కళాబృందం, షిటీమ్,మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్తంగా విద్యార్థులకు చట్టపరమైన, సామాజిక అంశాలు ఆటపాటల ద్వారా వివరించారు.
సైబర్ నేరాల గురించి వివరించి, మోసపూరిత లింకులు,మెసేజ్లకు స్పందించవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన వాళ్ళు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 నంబర్ను ఫోన్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల తయారీ సరఫరా రవాణా, అమ్మకాల సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు.
బాల్యవివాహాలు చేయవద్దని, అలాంటి సందర్భాల్లో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు ఫోన్ చేయాలని కోరారు. చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్-100కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సురక్ష పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.