04-11-2025 12:27:38 PM
							హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని(Warangal district) పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురుస్తోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో మోస్తరు వర్షం కురుస్తోంది. హనుమకొండలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో వాన పడుతోంది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వరంగల్ లో ఉరుములు మెరుపులతో కూడి జోరు వాన కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ లో పత్తి, మొక్కజోన్న తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం పడుతోందని అప్రమత్తమైన రైతులు పత్తి, మొక్కజోన్నను షెడ్లకు తరలించేలోపే వర్షం(Rains) కురవడంతో మొత్తం తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. పత్తి, మొక్కజొన్నలు తడిసిన కారణంగా కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్, లింగాల ఘనపూర్, తరిగొప్పుల, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాల్లో వర్షం దంచికొడుతుంది. వర్షానికి తడిసిన పంటను ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు.