31-07-2025 12:00:00 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
ఖమ్మం, జులై 30 (విజయ క్రాంతి): మారాల్సింది కమ్యూనిస్టులు కాదని మతోన్మాదులేనని మతం పేరుతో దేశాన్ని అదోగతి పాలు చేస్తున్న బిజెపి వైఖరిలో మార్పు రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. బిజెపి అధ్యక్షులు రాంచందర్రావు అవగాహన లేకుండా మాట్లాడుతూ కలల ప్రపంచంలో ఊగుతున్నారని తెలంగాణలో బిజెపికి అధికారం రావడం కల్లా అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సిపిఐ జిల్లా సమితి పేరుతో అయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కమ్యూనిస్టులు మారాలని రాంచందర్రావు కోరుతున్నారని ఎందుకు మారాలని సురేష్ ప్రశ్నించారు. పేదల పక్షాన సంక్షేమం, హక్కుల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని, దేశ పరిరక్షణ కోసం కమ్యూనిస్టులుగా పోరాడుతున్నామని ఆయన తెలిపారు. పేదల పక్షాన ఉన్న కమ్యూనిస్టులు మారాలా లేక ఈ దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్న బిజెపి మారాలో తేల్చుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక అంతరాలు పెంచి ఈ దేశాన్ని బిజెపి అస్థిరత వైపు తీసుకుపోతుందని మతం సాకుగా చూపి దేశ ప్రజలను వీడదీస్తుందని ఆయన ఆరోపించారు. భారత దేశ సమాజంలోనే అత్యంత చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణ ప్రజలని ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బిజెపి కలలు కంటుం దని అవి నెరవేరబోవని సురేష్ స్పష్టం చేశారు.