01-08-2025 02:06:41 PM
హైదరాబాద్: బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో(Sundaraiah Vignana Kendram) నవ తెలంగాణ దినపత్రిక 10వ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వార్తా కథనాలను నిశితంగా గమనిస్తూ ఉంటానని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు రాసిన విశ్లేషణలు మాకెంతో ఉపయోగపడతాయని తెలిపారు. పరిపాలనపై పట్టు సాధించాలంటే విశ్లేషణలు చదవాలన్నారు. అన్ని అంశాలు ఒకే చోట క్రోడీకరించి విశ్లేషణలు రాయడం ఎంతో ఉపయోగకరం అన్నారు. తప్పు చేసేవాళ్లను గద్దె దించడంలో కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. అబద్ధాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని నిర్ణయించుకున్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా బాగా నమ్మితేనే.. మోసం చేస్తారు..కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు.. ఎన్ని మసాలాలు ఉన్నా.. ఉప్పు లేకపోతే వంటకు రుచి రాదు అని ఆయన వివరించారు. సమస్యలు పరిష్కారం కోసం కమ్యూనిస్టులు(Communists) పోరాడతారని సీఎం వెల్లడించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం కమ్యూనిస్టులని గుర్తుచేశారు. కమ్యూనిస్టులు సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే మేం అధికారంలోకి వచ్చాం అన్నారు.