06-07-2025 10:57:51 PM
డాక్టర్ పట్టా పొందడం పట్ల గిరిజనుల హర్షం..
తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ గిరిజన ఉద్యమాలు-సాహిత్యం' అనే అంశంపై పరిశోధన చేసి, బెంగళూరు విశ్వవిద్యాలయం(Bengaluru University) నుంచి గూగులోతు పూల్ సింగ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాలో గూగులోతు జెమ్లా, సత్తెమ్మలకు జన్మించారు. 1వ తరగతి 10వ తరగతి వరకు తుంగతుర్తి శ్రీ విద్యభారతిలో, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యను సూర్యాపేటలో పూర్తి చేసుకుని.. బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కె. ప్రభాకర్ పర్యవేక్షణలో పిహెచ్.డి. పూర్తి చేశారు. వీరు చేసిన పరిశోధనకు గాను బెంగళూరు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా రామన్నగూడెం తండా వాసులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఒక గిరిజన తండా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, బెంగళూరు విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకోవటం, పిహెచ్.డి. పట్టాను అందుకోవటం సంతోషంగా ఉంది అని అన్నారు. డాక్టర్ పూల్ సింగును ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో గిరిజనులకు సంబంధించిన చరిత్ర, ఆచారాలు, సంప్రదాయాలపై మరిన్ని పరిశోధనలు జరగాలని అందుకు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. పట్టభద్రుడైన డా. గుగులోతు పూల్సింగ్ ను బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు ఆచార్య కె. ఆశాజ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. కె. ప్రభాకర్, అధ్యాపక బృందం, పరిశోధక విద్యార్థులు, తండావాసులు, అభినందనలు తెలియజేశారు.