15-12-2025 08:08:42 PM
- రూ.25 లక్షల సొంత నిధులతో పనులు చేయిస్తా
- చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి
ఎల్బీనగర్,(విజయక్రాంతి): చంపాపేట డివిజన్ పరిధిలోని పోచమ్మ గడ్డ బస్తీలో నెలకొన్న ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తానని కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అన్నారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి, జీహెచ్ఎంసీ శానిటేషన్, ఇంజినీరింగ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ తదితర విభాగాల అధికారులు సోమవారం బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... పోచమ్మ గడ్డలోని నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునఃనిర్మాణానికి సొంత నిధుల రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోచమ్మ గడ్డలో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, బస్తీలో పూర్తిస్థాయిలో కేబుల్ వైర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చంపాపేట డివిజన్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతుల పనులు చేపట్టి కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ ఏఈ సురేష్, వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ సంజీవ్, జవాన్ నరసింహ, ఎస్ఎఫ్ఏ శరత్, కరెంట్ లైన్మన్ గణేష్, పోచమ్మ గడ్డ బస్తీ వాసుల ప్రెసిడెంట్ గంగా బాబు, జనరల్ సెక్రటరీ నరసింహ, బీజేపీ చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు పొరెడ్డి రవీందర్ రెడ్డి, నాయకులు లింగాల దశరథ్ గౌడ్, కరుణాసాగర్, గూడూరు అవినాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుమిత్ సింగ్, అంజి తదితరులు పాల్గొన్నారు.