20-08-2025 01:36:39 AM
-ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించొద్దు
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికపై తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయం లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ కేబుల్ వైర్లను తొలగించాలని గత సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేటర్లకు పలుమార్లు నోటీసులిచ్చాం.. కావలసిన సమయం ఇచ్చాం.. అయినా వారు స్పందించడం లేదన్నారు.
ఇప్పుడు ప్రజల ప్రాణా నికి ముప్పు ఏర్పడిందని , ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. యావత్తు అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఎలాంటి అనుమతులు లేకుండా.. విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే అధికారులు, సిబ్బంది వెంటనే వాటిని తొలగించాలన్నారు. హైదరాబాద్ మహా నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశిం చారు.
అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెంట్ సమర్పించిన డీపీఆర్పై సమావేశంలో చర్చిం చారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్త్ సరఫరా, వినియోగంపై సమీక్షించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, జెన్కో సీఎండీ హరీష్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.