వేతనాలు పెంచండి ఇరిగేషన్ సెక్రటరీకి రిటైర్డ్ ఇంజినీర్ల వినతి
హైదరాబాద్, జూన్ 20(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిప్యూటీ క్యాడర్లోని జూనియర్లతో సమానంగా తమకు వేతనం పెంచాలని 9 మంది రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్లు గురువారం నీటిపారుదల శాఖ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. తాము డిప్యూటీ క్యాడర్ స్థాయిలో వేతనాలను కోరడం లేదని, జూనియర్ల స్థాయిలో అడుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాదని, వేతనాలు పెంచాలని సర్కారు మార్గరద్శకాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం 70 ఏళ్ల వయస్సులో ఉన్న తాము ఏడాదిగా తిరుగుతున్నామని వెల్లడించారు. జూనియర్లతో సమానం గా తమకు వేతనాలు పెంచే అధికారాలను ఇంజినీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్)కు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో రిటైర్డ్ ఎస్ఈలు తులసీదాస్, గణపతిరావు ఉన్నారు.






