28-01-2026 10:54:29 AM
ట్రాన్స్పోర్ట్ శాఖా ఆధ్వర్యంలో 2కే వాకథాన్
పాల్గొన్న పియూ వీసీ శ్రీనివాస్
పాలమూర్ యూనివర్సిటీ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పాలమూర్ యూనివర్సిటీ నుండి వన్టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మహబూబ్నగర్ ట్రాన్స్పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో 2K వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలమూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. “రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుని సామాజిక బాధ్యత అన్నారు. యువత రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండి, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతాం” అని పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులలో బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
అనంతరం పోలీస్ శాఖ తరపున అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం గారు మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వాడకం వల్ల ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. ఈ 2కే వాకథాన్ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి రఘు కుమార్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.