ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
గౌరారం రైతు వేదికలో వీసీలో పాల్గొన్న కలెక్టర్ హైమావతి
గజ్వేల్, జూన్ 30: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ కార్యక్రమాన్ని గౌరారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, రైతులు, అధికారులు వీక్షించారు.
ఈ సందర్భంగా ములుగు డివిజన్ పరిధిలో రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, రైతుల ఖాతాల్లో జమ కానున్న నిధుల వివరాలను వ్యవసాయ శాఖ ఏడీఏ అనిల్ కుమార్ వివరించారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను హార్టికల్చర్ జిల్లా అధికారి సువర్ణ కలెక్టర్కు తెలియజేశారు. గౌరారం, గజ్వేల్ రైతు వేదికల్లో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.






