24-09-2025 06:35:00 PM
పాత జీవో ప్రకారం జీతాలు చెల్లించాలి
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డైస్, రేడియో గ్రాఫర్ ఉద్యోగులకూ పాత జీవో ప్రకారం పీఆర్సీ కలిపి జీతాలు చెల్లించాలి, దసరా పండుగ సందర్భంగా రూ.20 వేల అడ్వాన్స్ అందజేయాలని డిమాండ్ చేస్తూ, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు చిరంజీవి నాయకత్వంలో డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయ సూపరిండెంట్ ఎండి షఫీ యుద్దీన్కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... పర్మినెంట్ ఉద్యోగులకు రూ.25 వేలు దసరా అడ్వాన్స్ ఇస్తున్న సమయంలో సమానంగా శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించడం తగదన్నారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం రూ.20 వేల పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని కోరారు. ఎన్హెచ్ఎం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఉద్యోగులకూ ప్రభుత్వ గుర్తింపు లభించాలన్నారు. నూతన జీవో ప్రకారం కాకుండా పాత జీవో ప్రకారమే పీఆర్సీ కలిపి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.