28-01-2026 10:42:01 AM
అశ్వాపురం,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరగాలని, నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నుంచి నేరుగా ఇసుకను తోలితే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ మణిధర్ హెచ్చరించారు. ఇందిరమ్మ లబ్ధిదారులు, గృహ, వ్యాపార అవసరాలకు కావలసిన ఇసుకను తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్ 'మన ఇసుక - మన వాహనం' ద్వారానే బుక్ చేసుకోవాలని, దగ్గరలో ఉందని అక్రమంగా గోదావరి నుంచి తోలితే సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహన యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని, అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిఘా పెంచాయని, ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా కేటాయించిన రీచ్ల నుంచే ఇసుక పొందాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన సూచించారు.