25-09-2025 12:04:30 AM
మాలమహానాడు జాతీయ చైర్మన్ చెన్నయ్య
సూర్యాపేట, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక రిధికా గ్రాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా మాలమహానాడు అధ్యక్షులుగా పెన్పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు వినయ్కి నియామకపత్రం అందజేసి మాట్లాడారు. జనాభా లెక్కలు చేయకుండానే మాలలకు 5 శాతం, మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
నవంబర్ 2న హైద్రాబాద్లో నిర్వహించే మాలల రణభేరి మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాలల రణభేరి కరపత్రాలను ఆవిష్కరించి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం అయిన పంగరెక్క సంజయ్ కి నియామక పత్రం అందజేశారు.
మాలమహానాడు జాతీయ అధ్యక్షులు భూర్గుల వెంకటేశ్వర్లు, మాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షలు పర్వి కోటేశ్వర రావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు లక్మాల మధుబాబు, ప్రకాష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, పాలపాటి సుమలత, యాదాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు కే లలిత, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్క సైదులు, జిల్లా అధ్యక్షులు అనుములపురి కృష్ణలు పాల్గొన్నారు.