29-10-2025 12:12:39 AM
వారే హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు
గజ్వేల్, అక్టోబర్ 28: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లోని వి మార్ట్ స్టోర్ లో సెక్యూరిటీ గార్డు గా పని చేస్తున్న ఆడెపు బాలయ్య (60) మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గజ్వేల్ పట్టణంలోని బీడీ కాలనీలో నివసిస్తున్న బాలయ్యకు భార్య పుష్ప, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఐదు సంవత్సరాలుగా గజ్వేల్ విమార్ట్ లో బాలయ్య సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు.
సోమవారం రాత్రి 6 గంటలకు డ్యూటీ కి వచ్చిన బాలయ్య మంగళవారం ఉదయం తిరిగి ఇంటికి రాలేదు. బాలయ్య విమార్ట్ లో హత్యకు గురయ్యాడని తెలియగానే కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
డాగ్ స్క్వాడ్ తో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. బీహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లా కు చెందిన రితేష్ రాయి (28), రంజిత్ రాయి (27) ఇద్దరు గజ్వేల్ విమార్ట్ ప్రారంభం నుండి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులు రితేష్ రాయ్, రంజిత్ రాయ్ లు మరో సెక్యూరిటీ గార్డ్ అయిన ఆడేపు బాలయ్యను గొంతు నులిమి హత్య చేసి పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.