10-07-2025 05:52:50 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీశ్రీశ్రీ విజయదుర్గ దేవి ఆలయంలో శాకాంబరి అమ్మవారి ఆషాడ మాస నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఈనెల పదవ తేదీ, చివరి రోజున శాకాంబరి అమ్మవారి విశేష అలంకరణ దర్శనం, మహా హారతిలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారిని శాఖాహారంతో అలంకరించి పూజించే ఒక పండుగ అని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఇది ఆషాడ మాసంలోనే వస్తుందని, ఉత్సవాలలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు , ఆకుకూరలతో అలంకరించడం జరుగుతుందని తెలిపారు. శాకంబరి ఉత్సవాలు ఆహార భద్రత , పంటల సమృద్ధి, ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయన్నారు. ఈ ఉత్సవాలకు అశేష సంఖ్యలో తరలివచ్చే భక్తులు అమ్మవారితో తమ బంధాన్ని పెంచుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. పదవ తేదీన జరిగే నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను సమస్త భక్తులు విజయవంతం చేసి, అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.