29-10-2025 12:05:38 AM
కోల్కతా, అక్టోబర్ 28: జాతీయ జట్టుకు దూరమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఈ బెంగాల్ పేసర్ 8 వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషిం చాడు. ఫిట్గా లేడంటూ చీఫ్ సెలక్టర్ చేసిన కామెంట్స్కు తన బౌలింగ్ ప్రదర్శనతోనే సమాధానమిచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో 44 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్లో మరింత అదరగొట్టి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులకు ఆలౌటవగా... తర్వాత గుజరాత్ కేవలం 167 పరుగులకే కుప్పకూలింది.
112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్ 214/8 దగ్గర డిక్లేర్ చేసింది. 327 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ను షమీ బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఫలితంగా గుజరాత్ 185 పరుగులకే ఆలౌటైంది. గత మ్యాచ్లోనూ షమీ ఉత్తరాఖండ్పై 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
ఇప్పటి వరకూ 2 మ్యాచ్లలో 15 వికెట్లు తీసి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. షమీ చివరిసారిగా భారత జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఫ్లాప్ అవ్వడంతో సెలక్టర్లు పక్కన పెట్టారు. యువ బౌలర్లకే అవకాశాలిస్తుండడంతో షమీకి చోటు దక్కడం లేదు. మరి తాజా ప్రదర్శన నేపథ్యంలో అతన్ని సౌతాఫ్రికా సిరీస్కైనా పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.