14-08-2025 12:18:46 AM
1908కి కాల్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఆగస్టు 13 : సమాజాన్ని మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ‘యాంటీ డ్రగ్స్ స్క్వాడ్’గా మారాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడితే వెంటనే 1908కి సమాచారం అందించాలని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకుని బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి యువత, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.
హుస్నాబాద్ లోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా యువతతో ప్రమాణం చేయిస్తూ, ‘మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, డ్రగ్స్ రహిత జీవనశైలికి కట్టుబడి ఉంటాం‘ అని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ‘క్షణకాలం సంతోషం ఇచ్చే డ్రగ్స్ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాయి.
మనం పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి డ్రగ్స్కు బానిసలమైతే మన జీవితాలే కాదు, దేశాభివృద్ధి కూడా దెబ్బతింటుంది‘ అని హెచ్చరించారు. తల్లిదండ్రులు, కుటుంబాలకు భారంగా మారకుండా, యువత తమ జీవితాలను నిర్వీర్యం చేసుకోవద్దన్నారు. భారత ప్రభుత్వం ‘నశాయుక్త భారత్ అభియాన్’ కింద దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు.
ఈ ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతుందన్నారు. ‘డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు‘ అనే నినాదంతో ముందుకు సాగాలని, తమ చుట్టూ ఎక్కడైనా మత్తుపదార్థాల వాడకం కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.