24-10-2025 12:00:00 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, అక్టోబర్ ౨౩ (విజయ క్రాంతి): 2026 ఖరీఫ్ సీజన్ నాటికి సారునీరు అందించే విధంగా ప్రణాళికతో సీతారామ పాలేరు కెనాల్ టన్నెల్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, దమ్మాయిగూడెం లలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 16వ ప్యాకేజీ లోని పాలేరు లింకు కెనాల్ టన్నెల్ పనులను గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 2026 ఖరీఫ్ నాటికి గోదావరి, మున్నేరు జలాలను మన ప్రాంత రైతులు వినియోగించుకునే విధంగా చేపట్టిన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 8.2 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులకు ప్రతిరోజు 24 మీటర్ల మేర పనులు చేపట్టి ఇప్పటి వరకు నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన టన్నెల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా పోచారం వద్ద పెండింగ్ ఉన్న భూ సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్ఇ యం. వెంకటేశ్వర్లు, డిఇ రమేష్ రెడ్డి, తిరుమలాయపాలెం మండల తహసీల్దారు విల్సన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.