ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రజాపాలన సంబురాలా..!
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్
మునిపల్లి,(విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజా ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టేందుకు ఇప్పుడు 90రోజుల ప్రజాపాలన సంబురాలను చేయడం విడ్డురంగా ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజలకు ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చినప్పటికీ 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ పూర్తిగా నెరవేర్చారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
అలాగే రూ.4,000 వృద్ధాప్య పెన్షన్ ఇచ్చినందుకా ఈ ప్రజా పాలనా..?, కళ్యాణలక్ష్మిలో తులం బంగారం ఇచ్చారా ?, మహిళలకు, నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం చేశారా..?, రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12,000 ఇచ్చినందుకా, లేక రైతు భరోసా 3 విడతల నిధులు ఎగ్గొట్టినందుకా ఈ ప్రజా పాలనా...?, ఇస్తామన్న దళిత బంధు ఇచ్చారా...?, యువ వికాసం పథకం కింద విద్యార్థులకు ఇస్తానన్న రూ.5 లక్షల విద్యా భరోసా ఎక్కడా...?, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి - ఎక్కడా..? ఇవన్న నెరవేర్చకుండా 90రోజుల ప్రణాళిక ప్రజాపాలన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి సంబురాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




