04-09-2025 01:46:40 AM
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్
మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలను తొలగించడానికి మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని శ్రీ గుంజేడు ముసలమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ అభివృద్ధికి తమ వంతుగా భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని, భక్తుల తాగునీటి సౌకర్యార్థం గుంజేడు దేవాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారేంటీలను తప్పక అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, రూరల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ఎస్. కె సల్మాన్ పాష, లావణ్య వెంకన్న, భూర్క నరేందర్, కళ్యాణ్, బోడ ఈర్య, హలవత్ సురేష్, చెన్నూరీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.