30-07-2025 12:45:09 AM
గద్వాల్ టౌన్ జూలై 29: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జూలై 30,2025 సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంఘం (RDS) మరియు వివిధ సంస్థల సమన్వయంతో మంగళవారం గద్వాల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మాట్లాడుతూ ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మనుషుల అక్రమ రవాణాకు గురవుతున్న బాధితులకు మద్దతు ఇవ్వడం వారి హక్కులను కాపాడడం,రక్షణ కల్పించడం.
ఈ సంవత్సరం థీమ్: ‘టెక్నాలజీతో నిరోధం-మానవ రవాణాను అడ్డుకోండి,బాధితులను రక్షించండి‘. ఇది ఒక మానవ హక్కుల సమస్యగా మారింది.ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు,పిల్లలు మరియు పురుషులు ప్రలోభాలకు గురై,శారీరక శ్రమ,వ్యభిచారం మరియు ఇతర అనేక రూపాల్లో శోషణకు గురవుతున్నారు.
భారతదేశంలో ముఖ్యంగా మహిళలు మరియు బాలికలు మాయచేసే ఉ ద్యోగాల పేరుతో లేదా వివాహ హామీల పేరుతో అక్రమ రవాణాకు గురవుతున్నారు.ఈ సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ శాఖ,స్వచ్ఛంద సంస్థలు మరియు సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి చట్టాలను కఠినంగా అమలు చేసి, బాధితులను గుర్తించి వారికి పునరావాసం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వి.రాజేందర్,బి. శ్రీనివాసులు,డి.లక్ష్మణ స్వామి,రైల్వే పోలీస్ యంత్రంగం ఇతర స్వచ్చంద సంస్థలు పాల్గొన్నాయి.