25-10-2025 12:00:00 AM
మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో సమ్మె బాట
చేగుంట, అక్టోబర్ 24 : చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఉన్న అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు అక్రమ బదిలీలు ఆపాలంటూ 18 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో పరిశ్రమ మజ్దూర్ సంఘం జనరల్ సెక్రెటరీ కుల్ల నర్సింలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పరిశ్రమలో స్థానికంగా ఉన్న 69 మంది శాశ్వత కార్మికులను ఢిల్లీ, చత్తీస్ఘడ్ లాంటి రాష్ట్రాలకు అకారణంగా ముగ్గురు కార్మికులను అక్రమంగా బదిలీ చేశారని, ఈ బదిలీలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
యాజమాన్యం తమ అభ్యర్థనను ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎంపీ, కార్మిక శాఖ మంత్రికి తమ సమస్యలను వివరించగా వారు సానుకూలంగా స్పందించారని, అయితే కంపెనీ యజమాన్యం స్పందించడం లేదని, మాకు ఢిల్లీ హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ రావాలని మొండి వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు.
ప్రతి సంవత్సరం దసరా, దీపావళికి ఇచ్చే బోనస్ కూడా యజమాన్యం ఇవ్వడం లేదని, మా పొట్ట కొట్టిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కుంట రాజ్ కుమార్, మిరుదొడ్డి కుమార్, చవాన్ సురేష్, నవీన్ యాదవ్, నంద్యాల శ్రీనివాస్, పెద్ద కృష్ణ, సునీల్ పాస్వాన్, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.