17-02-2026 12:52:08 AM
మణుగూరు, ఫిబ్రవరి16 (విజయక్రాంతి) : మున్సిపాలీటీ పరిధిలోని కూరగాయ దుకాణాల వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను జలగల దోసుకుంటున్నారని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయ దుకాణాలలో వ్యాపారుల దోపిడీని అరికట్టి, సామాన్య ప్రజలకు ధరలను అందుబాటులో ఉంచాలని ఆయన మున్సిప ల్ కమిషనర్ ప్రసాదుకు సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలో కొందరు దుకాణదారులు, కూరగాయల వ్యాపారస్తులు అధిక ధరలతో సామాన్య ప్రజలను దోచుకు తింటున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన చర్యలు తీసుకుంటామంటూ ఒక్క సారి కూడా షాప్ లను తనిఖీ చేయకుండా అందించే ముడుపుల మత్తులో జోగుతున్నారని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే అధికారులు వ్యాపారస్తుల ఆర్థిక దోపిడీని నిలువరించాలని, ధరల నియంత్రణ చట్టం అమలుపరచా లని, వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రతి దుకాణంలో ధరల పట్టికను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో హైకోర్టును ఆశ్రయించి , ప్రజాప్రయోజనాల కోసం వ్యాజ్యం దాఖలు చేస్తానని పేర్కొన్నారు.