16-08-2025 11:07:08 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): విద్యుత్ అధికారులు పర్యవేక్షణ లోపం, గ్రామపంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలే వీధి దీపాలు(Street lights) వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్ సిబ్బంది, కార్యదర్శులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని పినపాక పట్టి నగర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి.
పగలు,రాత్రి తేడా లేకుండా వెలుగుతుండడంతో వందలాది యూనిట్లు విద్యుత్ వృథా అవుతున్నది. ఫలితంగా విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రత్యేక లైన్లు ఆన్ఆఫ్ స్విచ్లను ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నిరంతరం విద్యుత్ను అందించడానికి వేల కోట్ల వెచ్చిస్తున్నా విద్యుత్ను ఆదా చేయాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ ఆదాయం,జనాభా మేరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా రాత్రి పూట ఆన్ చేసి ఉదయం పూట ఆఫ్ చేయాలి. కానీ అలా జరగడం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. అధికారులు స్పందించి గ్రామాలలో వీధిలైట్లకు ప్రత్యేక లైన్ ఏర్పాటుచేసి ఆన్ఆఫ్ స్విచ్లను ప్రజలు కోరుతున్నారు.