25-03-2025 12:04:54 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఇటీవల కాలంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మాఫియా విస్తృతంగా పెరిగి అనేక మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అసెంబ్లీలో ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు బేట్టింగ్ యాప్ ఇలా విషయమై ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
అనేకమంది మధ్యతరగతి యువత ఈజీ మనీకి అలవాటుపడి ఈ బెట్టింగ్ ఊబిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని ఆయన తెలిపారు. యువత బెట్టింగ్ యాప్స్ వలన పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయి ఆర్ధికంగా, మానసికంగా క్రుంగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ధన్పాల్ వాపోయారు.
ఈ మధ్య ఒక మీడియా పత్రికలో ఒక మాజీ మంత్రి ప్రమేయంతో ఈ యాప్స్ నిర్వాహణ జరిగిందని వస్తున్నా కథనాలపై వెంటనే విచారణ జరపాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం కొందరు ప్రమోటర్లకు నోటీసులు పంపి కేసులు బుక్ చేసి చేతులు దులుపుకోవడానికే పరిమితం కాకుండా అసలైన దోషులను గుర్తించి ముఖ్యంగా యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
బెట్టింగ్ యాప్ దోషులను వదిలేస్తే వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని గతంలో డ్రగ్స్ కేసు నిరుకార్చినట్టు కాకుండా ఈ బెట్టింగ్ మాఫియా పై పూర్తి స్థాయి విచారణ జరపాలని దోషులు ఎంతటి వారినైనా ఉపేక్షిచకుండా చర్యలు తీసుకొవాలని ప్రభుత్వాన్ని కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ OTS (వన్ టైం సెటిల్మెంట్) ద్వారా ఆస్తిపన్ను బకాయిలపై 90% వడ్డీ మాఫీ కల్పిస్తూ, ప్రిన్సిపాల్ + 10 శాతం వడ్డీ చెల్లిస్తే పూర్తిగా పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించి ఈ పథకం ద్వారా జిహెచ్ఎంసి రు:300 నుండి రూ:500 కోట్లు ఆదాయం సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. కానీ తెలంగాణలోని 13 మునిసిపల్ కార్పొరేషన్లకు కూడా ఏలాంటి వెసులుబాటు కల్పించలేదని నిజామాబాదు వంటి కార్పొరేషన్లకు కూడా ఆస్థిపన్ను వడ్డీ మాఫీ వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసారు.