30-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూన్ -29 (విజయ క్రాంతి) :ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.బోనకల్ మండలంలోని కలకోట, బ్రాహ్మణ పల్లి, రాయన్న పేట, ముదిగొండ మండలంలో గంధసిరి, గంగాపురం, పెద్ద మండవ,
చింతకాని మండలంలో చిన్న మండవ, మధిర మండలంలో కమ్మంపాడు, చిలుకూరు, నక్కల గరుబు, ఎర్రుపాలెం మండలంలో తక్కెల పాడు, ఇంగాలి, చొప్పకట్లపాలెం, తిరుమలాయపాలెం మండలంలో ముజిడు పురం, హైదర్ సాయి పేట, కూసుమంచి మండలంలో జక్కేపల్లి, తల్లాడ మండలంలో గొల్లగూడెం, వైరా మండలంలో ఖానాపురం, వెప్పలమడక వద్ద ఇసుక రీచ్ లను గుర్తించడం జరిగిందని కలెక్టర్ అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందని, ఎటువంటి సీనరేజి చార్జిలు ఉండవని అన్నారు. ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే ఇసుక తరలింపు చేయాలని, రాత్రి వేళలో ఇసుక తరలింపుకు అనుమతి లేదని కలెక్టర్ తెలిపారు.ఇట్టి సదుపాయాన్ని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.