విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి
బీజేపీ నాయకులు
మంచిర్యాల టౌన్, ఆగస్టు 6: విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 14 వేల కోట్ల స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురు వారం ‘ఫీజుల బకాయి - బీజేపీ లడాయి’ పేరిట మంచిర్యాలలోని వివిధ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుండె గణేష్ లు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. పది ఏండ్లు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీ రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయకుండా విద్యార్థులను, తల్లితండ్రులను మనోవేదనకు గురి చేస్తుందన్నారు.
డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీ రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్ లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులకు, ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏతం శివకృష్ణ, బొలిశెట్టి అశ్విన్, దుర్గం అశోక్, తుల ఆంజనేయులు, గాజుల ముఖేష్ గౌడ్, బోట్ల అనిత, కస్తూరి నాగరాజు, బేర సత్యనారాయణ, పెద్దపల్లి పురుషోత్తం, జోగుల శ్రీదేవి, ఎనగందుల కృష్ణ మూర్తి, కమలాకర్ రావు, పట్టి వెంకట కృష్ణ, పచ్చ స్వప్న రాణి, ఆడే ప్రేమ్ సింగ్, అమిరిశెట్టి రాజ్ కుమార్, కొండ వెంకటేష్, రెడ్డిమల్ల అశోక్, సాయి ఠాకూర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






