25-08-2025 09:46:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఎస్సీ కార్యాలయంలో పోలీస్ ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.
తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదు పైన సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి, ఫాలోఅప్ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా పర్యవేక్షణ చేస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పారదర్శక విధానంలో చర్యలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.