13-11-2025 05:01:26 PM
- సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
- మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి కష్టపడి చదవి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ కోరారు. జిల్లా షీ టీమ్ ఇన్చార్జి, ఎస్ఐలు ఉషారాణి, హైమ, మంచిర్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, T-Safe యాప్, షీ టీమ్ లపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో (ఫేస్ బుక్, ఇంస్టా గ్రామ్, వాట్సాప్ వేదికలలో) గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయడం, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవడం వంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ వేధింపులకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
విద్యార్థినులు ఆకతాయిల వేధింపులకు గురైనప్పుడు, ఈవ్ టీజింగ్ లకు భయపడకుండా వెంటనే డయల్ 100కు లేదా షీ టీమ్ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. వేధింపులను నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. చిన్నపిల్లలు శరీర భాగాలపై ఎవరైనా అపరిచితులు అనుచితంగా తాకినప్పుడు లేదా ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినప్పుడు అది బ్యాడ్ టచ్ అని గ్రహించి, వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని వివరించారు. విద్యార్థినులు, మహిళల భద్రత కోసం T-Safe యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, అత్యవసర పరిస్థితుల్లో దానిని ఉపయోగించే విధానం గురించి వివరించారు. షీ టీమ్ సేవలు, వాటి ఉద్దేశాన్ని గురించి వివరిస్తూ, ఎప్పుడూ అందుబాటులో ఉండే రామగుండం షీ టీమ్ నంబర్ (వాట్సప్ 6303923700), మంచిర్యాల షి టీమ్ (8712659385) నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మహిళా విద్యార్థుల రక్షణకు పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, మీ రక్షణ మా బాధ్యత అని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మంచిర్యాల ట్రాఫిక్ సీ ఐ సత్యనారాయణ సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ సారూప్య, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ సీమ, మహిళా కానిస్టేబుళ్లు జ్యోతి, శ్రీలత, కానిస్టేబుల్ సతీష్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.