9 April, 2026 | 1:23 AM

సుమోటోగా సరోగసీ మహిళ సూసైడ్ కేసు

30-11-2024 01:15 AM

సీఎస్, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): సరోగసీ కోసం హైదరాబాద్‌కు వచ్చిన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) సీరియస్ అయింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఎఫ్‌ఐఆర్ స్టేటస్‌తో రెండు వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీలకు ఈమేరకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీచేసింది.

సరోగసి పేరిట మహిళలపై వేధింపులకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటి వివరాలను తెలపాలని కోరింది. హైదరాబాద్‌కు చెందిన రాజేష్‌బాబు.. సరోగసీ ద్వారా తనకు పిల్లలను కని ఇచ్చేందుకు ఒడిశాకు చెందిన మహిళ, ఆమె భర్తతో ఒప్పందం కుదుర్చుకుని నగరానికి రప్పించిన విషయం తెలిసిందే. అనంతరం అతని ప్రవర్తన నచ్చని ఆమె భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనమైంది.