టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
- 34,126 మంది విద్యార్థులు పాస్
- వంద శాతం రిజల్ట్తో నిర్మల్ జిల్లా టాప్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మొత్తం 51,272 మంది సప్లిమెంటరీకి రిజిస్టర్ చేసుకోగా 46,731 మంది పరీక్షలు రాశారు. 34,126 (73.03 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలురు 71.01 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 76.37 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిర్మల్ జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 42.14 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉన్నది.
8 వరకు రీకౌంటింగ్ ఛాన్స్
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జూలై 8వ తేదీలోపు ఎస్బీఐ బ్యాంక్ ద్వారా చలాన్ చెల్లించాలి. ఆ చలాన్తో పాటు దరఖాస్తును ఎస్సెస్సీ బోర్డులో సమర్పించాలి. డీడీలు చెల్లుబాటు కావని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు.
ఫలితాలు ఇలా
హాజరైనవారు పాసైనవారి సంఖ్య ఉత్తీర్ణత శాతం
బాలురు 29,142 20,694 71.01
బాలికలు 17,589 13,432 76.37
మొత్తం 46,731 34,126 73.03




