14-03-2025 01:06:50 AM
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న కార్య క్రమాలకు మద్దతుగా నిలవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో ఆయ న్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా 2025లో హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ కార్యక్రమాలైన మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్ గేమింగ్, వీఎఫ్ఎక్స్తోపాటు వినోద పరిశ్రమలో తెలం గాణ బలాన్ని చాటే ఇండియా జాయ్ వివరాలను కేంద్రమంత్రి జైశంకర్ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ‘తెలంగాణ రైజింగ్’ను ప్రోత్సహించేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ రైజింగ్ను విదేశాల్లో, భారత్లో జరిగే కార్యక్రమాల్లోనూ ప్రచారం చేయాలని, హైదరా బాద్లో నిర్వహించే కార్యక్రమాల విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వశాఖ మద్దతుగా నిలుస్తుందని కేంద్రమంత్రి జైశంకర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈసందర్భంగా హామీ ఇచ్చారు.
సీఎంతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీ ద్, నాగర్కర్నూలు, భువనగిరి లోక్సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.