11-10-2025 01:46:29 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రలోభాల కట్టడికి కలసికట్టుగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటిలిజెన్స్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కర్ణన్ మాట్లాడుతూ.. అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని సూచించారు.
24 గంటల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ ,వీడియో సర్వైలెన్స్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమా వేశంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీసీపీ అపూర్వరావు, ఇఈఎం నోడల్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, నోడల్ అధికారి నరసింహరెడ్డి, రాజ్కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు గుర్తింపు కార్డు ఎపిక్ కార్డ్ అందుబాటులో లేని వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండి, ఎపిక్ కార్డు లేని పౌరులు 12 అధికారిక ఫొటో గుర్తింపు కార్డులలో ఏ ఒక్కటి చూపినా ఓటు వేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.