1 April, 2026 | 10:19 AM

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

07-12-2024 04:53 PM

యువజన కాంగ్రెస్ నాయకులకు సంపూర్ణ సహకారం అందిస్తా

కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ యువజన కాంగ్రెస్ నేతలు మంచి నాయకులుగా ఎదగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఇటీవల ఆన్ లైన్ విధానంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలల్లో గెలుపొందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శనివారం నీలం మధు చిట్కూల్ గ్రామంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ తో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో యువతకు పెద్ద పీట వేస్తుందన్నారు.

గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారని,  ఒక ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ ప్రతి నేతను పార్టీ గుర్తించి గౌరవిస్తుందన్నారు. గతంలో యువజన కాంగ్రెస్ నాయకులుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన యువ నేతలంతా ప్రభుత్వంలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీగా, అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలో వివిధ హోదాలలో యువజన కాంగ్రెస్ కు ఎన్నికైన నాయకులంతా పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

నీలం మధును కలిసిన వారిలో నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంత అనిల్, పటాన్ చెరు అసెంబ్లీ ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, పటాన్ చెరు మండల్ వైస్ ప్రెసిడెంట్ లు నరేష్ రెడ్డి, ఉమర్, చిన్న సాయి, ప్రధాన కార్యదర్శి శివ యాదవ్, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ మన్నే నరేందర్, ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ బాబా, మియాపూర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నివేళలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.