23-08-2025 05:08:41 PM
వాటర్ ట్యాంక్ లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్..
11 మంది విద్యార్థులకు అస్వస్థత..
ఘటనపై ఎమ్మెల్యే, కలెక్టర్ సీరియస్..
రేగొండ/భూపాలపల్లి క్రైమ్ (విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అంతర్గత విభేదాలతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో జరిగింది. జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల(Urban Residential School)లో కలుషిత మంచినీరు త్రాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. విద్యార్థుల కథనం ప్రకారం, పాఠశాలకు చెందిన సైన్స్ టీచర్ రాజేందర్ మంచినీటిలో మోనో పురుగుల మందు కలపడంతో విద్యార్థులు ఆ నీటిని త్రాగి అస్వస్థతకు గురయ్యామని తెలిపారు.
ఉపాధ్యాయులు తమను నానారకాలుగా ఇబ్బందులకు గురి చేస్తు, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని తెలిపారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని వారు వెల్లడించారు. పాఠశాల సైన్స్ టీచర్ రాజేందర్ మంచినీటి ట్యాంకులో మోనో పురుగుల మందు కలిపి అనుమానం రాకుండా చేసేందుకు ముందు ఆ నీటిని రాజేందర్ తాగి అనంతరం దాన్ని విద్యార్థుల దుప్పట్లపై చళ్లాడని తెలిపారు. చూసిన విద్యార్థులను బెదిరించి ఈ విషయం బయటికి చెప్తే కొడతానని హెచ్చరించాడని విద్యార్థులు తెలిపారు.
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించి పూర్తి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, సైన్స్ టీచర్ రాజేందర్ ప్రిన్సిపాల్ పై కోపంతో తనని సస్పెండ్ చేయాలనే దురుద్దేశ్యంతో విద్యార్థుల మంచినీటి ట్యాంకులో పురుగుల మందు కలపాడని ఎవరికి అనుమానం రాకుండా అస్వస్థత గురైన విద్యార్థులతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులను, వంట మనిషిని సస్పెండ్ చేయడంతో పాటు చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అణగారిన పేద కుటుంబాల విద్యార్థులను తల్లితండ్రులు చదివించుకోవాలన్న ఉద్దేశ్యంతో వసతి గృహాల్లో ఉంచుతున్నారని, పిల్లలపై ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) మాట్లాడుతూ... మంచినీటిలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు, సూర్య ప్రకాష్, వంట మనిషి రాజేశ్వరి ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ అంతర్గత విబేధాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ ను ప్రత్యేక అధికారులు, పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి విద్యార్థులతో ముకాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోమెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. 24 గంటలు నిరంతరాయ వైద్య సేవలు అందించాలని, వైద్యుల పర్యవేక్షణ ఉండాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరె,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.