23-08-2025 09:08:54 PM
మణుగూరు,(విజయక్రాంతి): రైతులకు సరిపడా ఎరు వులను అందించలేని చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో అసమర్థ పాలనను సాగిస్తుందని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగాకాంతారావు విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసపూరిత వాగ్దానాలతో నాశనం చేసిందని, కనీసం ఎరువులు అందించడం లేదని, యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని మండి పడ్డారు. ఎరువుబస్తాల కోసం రైతులను క్యూలో నిల్చోబెట్టి మళ్లీ పాత రోజులను రేవంత్ ప్రభుత్వం గుర్తుచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో గ్రామ గ్రామానికి సరిపడా ఎరువులు పంపితే మళ్లీ కాంగ్రెస్ రాగానే ఎరువుల కోసం క్యూలైన్లు వచ్చాయన్నారు. యూరియా సరఫరా చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణం రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని లేని పక్షాన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా ఈనెల 25న జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యం లో జిల్లాలోని వ్యవసాయశాఖ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపడుతమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, రైతులు తప్పక హాజరై, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఆయన విజ్ఞప్తి చేశారు.