25-10-2025 10:50:49 PM
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు..
హన్మకొండ (విజయక్రాంతి): వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ వార్షిక(నిట్) సాంకేతిక మహోత్సవం టెక్నోజియన్ శనివారం వేడుకగా ముగిసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వరంగల్ ఎన్ఐటి పూర్వ విద్యార్థిని (సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఎం.టెక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్), బెంగళూరు భారతీయ విజ్ఞాన సంస్థ ప్రొఫెసర్ జి. మాధవి లతా హాజరై ప్రపంచంలోనే ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెనపై ఇచ్చిన నిపుణ ఉపన్యాసం ప్రేరణాత్మకంగా, ప్రధానాకర్షణగా నిలిచింది. సాంకేతిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. వెంకన్న టెక్నోజియన్ ఉద్దేశ్యాన్ని, సృజనాత్మకత, సహకారం, సాంకేతిక ప్రతిభకు నిదర్శనమన్నారు.
ఆయన ఆధ్వర్యం లో ప్రాజెక్ట్ ఎక్స్పో, ఉమెన్ ఇన్ టెక్ ఫోరం, జాతీయ స్థాయి బ్లేజ్ గేమింగ్ అండ్ కోడింగ్ మారథాన్ వంటి ముఖ్య కార్యక్రమాలు నిర్వహించారు. డీన్(స్టూడెంట్ వెల్ఫేర్) డాక్టర్ కె. కిరణ్ కుమార్ ముఖ్య అతిథి సందేశాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది దాదాపు 7000 మంది విద్యార్థులు పాల్గొనగా, విస్తృత శ్రేణి వర్క్షాప్లు, నిపుణుల ఉపన్యాసాలు, పోటీలు ప్రధాన ఆకర్షణలు గా నిలిచాయి. బ్లేజ్, షార్క్ ట్యాంక్ 2.0, రాకెట్ డిజైన్ అండ్ లాంచ్ (లాంచ్ప్యాడ్), బాంబ్’స్ అవే, స్కూప్ స్టాప్ మొదలైన ఈవెంట్స్, వినోదాత్మక పోటీలు టెక్నోజియన్ యొక్క స్ఫూర్తిని చాటాయి. టెక్నోజియన్–2025 సాంకేతిక ప్రతిభ, పట్టుదల, నిరంతర విద్య విలువను మరింత బలపరిచింది. వరంగల్ ఎన్ఐటి తన పూర్వ విద్యార్థుల విజయాలను స్మరించుకుంటూ అనుభవాత్మక అభ్యాసం, పరిశ్రమ-విద్యా భాగస్వామ్యం, భారత ఇంజనీరింగ్ ప్రతిభను వేడుక చేసుకునే వేదికగా నిలిచింది.