అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణ వ్యక్తి హత్య
అరుణాచలం: తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ( Arunachalam Giri Pradakshina) సందర్భంగా ఓ తెలుగు వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని తెలంగాణ జిల్లా యాదాద్రి జిల్లా సౌందరపురంలో నివాసముంటున్న విద్యాసాగర్ (32)గా గుర్తించారు. విద్యాసాగర్ శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు అతనిని ఢీకొట్టారు. దీంతో విద్యాసాగర్ యువకులతో గొడవకు పెట్టుకున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన ఇద్దరు తమిళ యువకులు తమ వద్ద ఉన్న కత్తితో అతనిపై దాడి చేశారు. విద్యా సాగర్ దగ్గర రూ.500 కాజేసి, గొంతు కోసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్ ను గమనించిన తోటి భక్తులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరువణ్ణామలైకి చెందిన గుగణేశ్వరన్ (22), తమిళరసన్ (25) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.






