12-07-2025 10:21:35 PM
ములుగు (విజయక్రాంతి): ఈ నెల 4వ తారీఖున మావోయిస్టుల దుశ్చర్యకు బలై, చికిత్స పొందుతూ మరణించిన ముకునూరు పాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య కుటుంబాన్ని శనివారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Dr. Shabarish) మృతుని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని భార్య సోయం సమ్మక్క యొక్క ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మృతుని కొడుకు సోయం అబ్రహంతో మాట్లాడుతూ.. కుటుంబ పెద్ద లేకపోవటం ఆ కుటుంబానికి తీరనిలోటు అని, ఆ విధంగా ఎవరికి జరగకూడదని సోయం కామయ్య మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మావోయిస్టులు చేసిన ఇట్టి దుశ్చర్యను ప్రజలందరూ ఖండించాలని అన్నారు.
అలాగే మృతుని కుటుంబానికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా త్వరగా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మృతుని కుమారుడు మాట్లాడుతూ.. తన తల్లి పక్షవాతం రోగంతో ఇబ్బంది పడుతుందని,అతని సోదరి మంద బుద్ధితో బాధపడుతున్నదని,వారికి పెన్షన్లు రావట్లేదు అని తెలియచేయగా వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పెన్షన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వెంకటాపురం సిఐ కుమార్ ని ఆదేశించారు. మృతుని కుటుంబానికి ఎటువంటి సాయం కావాలన్నా పోలీస్ యంత్రాంగ తరుపున తాము అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాధిత కుటుంబానికి ములుగు జిల్లా పోలీస్ వారి తరుపున ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గ్రామ పెద్దలు మరియు మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. నిషేధిత మావోయిస్టులు వారి రక్షణ పేరుతో తమ ఉనికిని చాటు కోవడం కోసం మరియు పోలీస్ వారి ప్రాణాలని తీయాలనే ఉద్దేశంతో అడవి మొత్తం ప్రెషర్ బాంబులు,ల్యాండ్ మైన్లు అమర్చి, అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే అమాయకులైన ఆదివాసీల ప్రాణాలను హరిస్తున్నారని అన్నారు. కానీ ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంటుందని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా, తోడుగా ఉంటుందని గ్రామస్తులలో ధైర్యాన్ని నింపారు.
మావోయిస్టులు అమర్చిన బాంబులను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిర్వీర్యం చేస్తున్నామని,దానిని నిత్యం కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా గ్రామస్థులకు హామీ ఇచ్చారు. తద్వారా ప్రజలు తమ నిత్యావసరాల కొరకు మళ్లీ అడవికి వెళ్లొచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ వెంకటాపురం సిఐ కుమార్ వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు సివిల్,సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.