రాయల వర్ధంతి సభను విజయవంతం చేయండి
ములకలపల్లి,(విజయక్రాంతి): ఈనెల 16న ఇల్లందులో జరిగే కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభను, స్థూపా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కల్లూరు కిషోర్ కోరారు. శనివారం మండల పరిధిలోని ముత్యాలంపాడు గ్రామంలో దీనికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం అలుపెరగని పోరాటం నిర్వహించారని, విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాలకు ప్రభావితులై రెండు దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడిపాడు అని తాను మరణించే వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే లీగల్ ఆర్గనైజేషన్ లో పార్టీ అభివృద్ధికి, విస్తరణకు కృషి చేశారని తెలిపారు. అమరవీరుని జ్ఞాపకార్థం ఈ నెల 16న ఇల్లందులో స్థూపావిష్కరణ ఉంటుందని, అలాగే వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభకు పాల్వంచ ప్రాంతం నుంచి అధిక జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు.






