calender_icon.png 4 June, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచంలో అగ్రగామిగా తెలంగాణ రైజింగ్

03-06-2025 01:47:49 AM

హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికగా మార్చాం

-అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నాం 

-రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం..

-మహిళలకు క్యూఆర్ కోడ్‌తో ఆరోగ్యకార్డులు అందిస్తాం..

-ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్

-రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

-9 మంది ఉద్యమకారులకు రూ.కోటి పురస్కారం అందజేత

* తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రాష్ట్రంలో శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా. 

 ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

* జాతీయ పురోగతికి తెలంగాణ అవిరళ కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.  

 నరేంద్ర మోదీ, భారత ప్రధాని

* తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. వికసిత్ భారత్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవసరమైన మౌలిక సదుపా యాలతో రాష్ట్రం ముందుంది. 

  త జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ గవర్నర్

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): 2047 నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా  నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని, ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘భారత్ సమ్మిట్’ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా హైదరాబాద్‌ను అంతర్జాతీయ వేదికగా మార్చామని, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ అధికారం లోకి వచ్చే నాటికి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని సీఎం చెప్పా రు.

సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో సోమవారం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయజెండాను ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిం చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రపంచ దేశాల నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీనదికి పూర్వవైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపడుతున్నాం.

బాపూఘాట్‌ను అంతర్జాతీయస్థాయిలో గాంధీ సరోవర్‌గా  తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సెన్సైస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. రాష్ర్టంలో మౌలిక సదుపాయాల్లో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హైద రాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రీజినల్ రైల్‌తో పాటు మెట్రో రైల్ విస్తరణ చేయబోతున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూ.24 వేల కోట్లతో మెట్రో రైలు రెండోదశ విస్తరణ ప్రాజెక్టు చేపడుతున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. 

పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించారు.. 

‘దశాబ్దాల పోరాటంతో విద్యార్థులు, -యువకులు, ఉద్యోగులు-, మహిళలు, మేధావు లు, కవులు, కళాకారులు, సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ర్ట ఆకాంక్షను నెరవేర్చుకు న్న రోజు.. ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ర్ట ప్రజల కలను నిజం చేసి న సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుం టూ తెలంగాణ అమరవీరులకు ఘననివాళులు అర్పిస్తున్నా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు.  

అమ్మ ఆదర్శ కమిటీలకు కీలక బాధ్యతలు..

‘పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమే కాదు.. ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టాం.’ అని సీఎం చెప్పుకొచ్చారు. 

మహిళలకు క్యూఆర్ కోడ్.. 

‘ నిర్లక్ష్యానికి గురై న యూనివర్సిటీలకు వీసీలను నియమిం చాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిష న్‌ను ప్రక్షాళన చేసి పోటీపరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్, సమాచార కమిషనర్లు, లోకాయుక్త సభ్యులను నియమించుకున్నామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణా లను పంపిణీ చేశాం. రాష్ర్టంలో మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్‌తో  కూ డిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం.’ అని సీఎం తెలిపారు.

రైతు సంక్షేమమే ధ్యేయం..

 రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభు త్వం పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ తెలిపారు. భూ వివా దాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. భూ హక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టం అని పేర్కొన్నారు.

యువతే మన భవిష్యత్తు..

‘యువతే మన భవిష్యత్తు..అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెల ల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించాం. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండి యా రెసిడెన్షియల్ స్కూ ల్స్ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యం గ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మా ణం చేపట్టాం’ అని సీఎం తెలిపారు. 

కులగణనతో దేశానికే ఆదర్శంగా.. 

 ‘కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. శాస్త్రీయంగా కులగణన నిర్వహించింది. బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం. దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణ యం తీసుకున్నాం. శాసనసభ, శాసన మం డలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నాం.

తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభు త్వం జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. రాష్ర్టంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబె ట్టుకుంది. ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పిం చాం. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా జరపాలని నిర్ణయించాం’ అని సీఎం పేర్కొన్నారు. 

నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు..

 ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణా నికి రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని, రూ.22,500 కో ట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిం చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు.

పేదల ఆకలి తీర్చడమే కాదు, వారు ఆత్మగౌరవంతో జీవించేలా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్‌వన్‌గా నిలిచిందని, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి దుబాయ్‌లో అంతర్జాతీయ అవార్డు లభించిందని కొనియాడారు. 

ప్రపంచం దృష్టికి తెలంగాణ రైజింగ్..

‘భారత్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం కల్పించాం. తెలంగాణ జరూర్ ఆనా అంటూ వందకు పైగా దేశాల నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. వారంతా తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు. ’ అని పేర్కొన్నారు. 

3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం..

దేశాన్ని 30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నామని,  అందుకే తెలంగాణ రైజింగ్ -2047 భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిద్దాలని నిర్ణయించామని, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 

౯ మందికి రూ.కోటి పురస్కారం.. 

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందించారు. నగదు పురస్కారం అందుకున్న వారిలో ఎక్కా యాదగిరి, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ, జయరాజు, పాశం యాదగిరి, గోరటి వెంకన్న, గూడ అంజన్న, గద్దర్ ఉన్నారు.

బండి యాదగిరి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో నగదు పురస్కారం ఇవ్వలేదు. సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారాన్ని సీఎం అందజేశారు. అలాగే 19 మంది పోలీసులకు మోడల్ ఫర్ గ్యాలెంట్రీ, 11 మందికి మోడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు ప్రదానం చేశారు. 

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర 

అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నా. గొప్ప సంస్కృతి, కష్టపడి పని చేసే ప్రజలతో తెలంగాణ ప్రకాశిస్తోంది. 

 కేంద్ర హోం మంత్రి అమిత్ షా

11 సంవత్సరాల క్రితం 

డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భవించి లక్షలాది మంది ఆశలు, కలలకు ఒక రూపాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారందరికీ నా హృదయపూర్వక నివాళులు. ప్రతి పౌరుడికి న్యాయమైన, గౌరవప్రదమైన, సంపన్నమైన భవిష్యత్‌ను నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ మీతో నిలుస్తుంది. ప్రతి కుటుంబానికి ప్రతి కలకి హామీలు అచంచలమైన నిబద్దతకు ప్రతిబింబంలా నిలుస్తాయి. 

 రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత

తెలంగాణ వల్లే నాలో ఉద్యమ స్ఫూర్తి

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిందని వెల్లడించారు. జనసేనకు జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మనిచ్చిన నేల, నాలో ఉద్య మ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ అంటూ కొనియాడారు.

- ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్