07-07-2025 12:24:46 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ జులై 6 (విజయ క్రాంతి): హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ జెండాను ఆవిష్కరించి, క్రీడల పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి వెన్నెముక నేటి క్రీడాకారులు అని అన్నారు.
క్రీడా రంగంలో అభివృద్ధి సాధించాలంటే క్రీడాస్పూర్తి అత్యవసరం, ఓటమికి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాలు, కోచింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని తెలిపారు.
టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వేదికలను అందించాలనే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. క్రీడల్లో విజయం సాధించాలంటే దృఢ సంకల్పం, శ్రమ, క్రమశిక్షణ అవసరం. విజయం లభించకపోయినా పాఠం నేర్చుకుని ముందుకు సాగాలి. అనంతరం ఎంపికైన క్రీడాకారులను, కోచ్లను వేదికపై అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు క్రీడాకారులు, కోచ్ లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.