15-10-2025 12:35:08 AM
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రి య రెండో రోజు కూడా10 మంది అభ్యర్థులు 11 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మొదటి రోజు కూడా 10 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. బరిలో నిలిచేందుకు స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నేతలు అధిక సంఖ్యలో ముందుకు వస్తుండగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా తమ నామినేషన్లను దాఖలు చేయడం లేదు.
షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. స్వతంత్రులుగా బింగి రాములు, కందాడి మణిపాల్ రెడ్డి, గుంటి శ్రీకాంత్, సంజీవులు ముల్య, పానుగోతు లాలా సింగ్, పబ్బతి శ్రీకృష్ణ ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సోమవారం ఒక సెట్ నామినేషన్ వేసిన వేముల విక్రమ్ రెడ్డి, మంగళవారం మరో సెట్ దాఖలు చేశారు.
వీరితో పాటు పలు చిన్న పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లను సమర్పించారు. పాటా పార్టీ తరఫున మాచర్ల వెంకట్ రెడ్డి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహ్మద్ మన్సూర్ అలీ, శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ తరఫున లంటు చంద్రశేఖర్ నామినేషన్లు వేశారు. దీతో రెండు రోజుల్లో మొత్తం 20 మంది అభ్యర్థులు, 22 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉంది.