15 April, 2026 | 3:21 AM

అధికారులతో కమిటీ కాలయాపనకే

08-05-2025 01:28 AM
  1. సీఎం జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలి
  2. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు వారితో కలిసి ఉద్యమిస్తాం
  3. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఇప్పటికే మంత్రుల కమిటీ ఉండగా, అధికారుల కమిటీని ఎందుకు అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. కాలయాపనకే ఈ కమిటీ అని మండిపడ్డారు. సీఎం జోక్యం చేసుకొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమాశంలో శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ నేతలు స్వామిగౌడ్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ఇంతకాలం వేచి చూశామని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. వందరోజుల్లో పీఆర్సీ ఇస్తామని, డీఏలు వెంటనే విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకూ వాటి గురించి పట్టింపే లేదని ధ్వజమెత్తారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ.. సీఎం నిరాశా నిసృహాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదన్నారు.

ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి డబ్బులు లేవంటున్న సీఎం, మరి అందాల పోటీల నిర్వహణకు డబ్బులు ఎక్కడివి అని ప్రశ్నించారు. ఉద్యోగులు పెట్టిన 54 డిమాండ్లలో 36 డబ్బులతో సంబంధం లేనివే అని చెప్పారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.