06-06-2025 01:11:16 AM
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అనంద్ గౌడ్
సిద్దిపేట, జూన్ 5(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అనంద్ గౌడ్ అన్నారు. వికసిత్ భారత్ అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తివుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షత కార్యశాలలో ఆనంద్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
జాతీయ భద్రత, గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని నగరాల వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని మోడీ పెద్ద పీఠ వేశారని కొనియాడారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతికారంగా ఆపరేషన్ సింధూర్ తో భారత దేశ సైనిక శక్తి గురించి ప్రపంచానికి చాటారన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి, అంతర్జాతీయ దౌత్యంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలతో దేశం ప్రపంచ శక్తిగా అవతరించిందని అన్నారు.
పంటలకు ఎంఎస్ పీ పెంపు, పిఎం కిసాన్ పథకం ద్వారా కోట్లదీ మంది రైతులకు లబ్ది చేకూర్చినట్లు చెప్పారు. గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్చ భారత్ పేరిట ప్రధాని మోడీ శ్రీకారం చుట్టిన ప్రజా ఉద్యమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందన్నారు. జాతీయరహదారుల అభివృద్ధి, ఉపాధిహామీ కూలీల కూలీ డబ్బుల పెంపు, విద్యా, వైద్య, రైల్వే రంగాలను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు వంగ రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారెడ్డి, నాయకులు చింత సంతోష్, తుంగ కనకయ్య, గుండ్ల జనార్ధన్, పట్టణ అధ్యక్షులు బాసంగారి వెంకట్, కాసునగొట్టు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ తో కలిసి పార్టీ నాయకులు మొక్కలను నాటారు.