06-06-2025 01:07:31 AM
-మాజీ మేయర్ వై సునీల్ రావు
కరీంనగర్, జూన్ 5 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థను 66 డివిజన్లుగా ప్రకటించిన డీ లిమిటేషన్ ముసాయిదా...పూర్తిగా అశాస్త్రీయంగా అసంబద్ధంగా ఉందని, భారతీయ జనతా పార్టీ పక్షాన ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్లు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.
గురువారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కక్షపూరితంగా కుట్ర చేసి... బలమైన ప్రతిపక్షం ఉన్నచోట వారు మాత్రమే లబ్ధి పొందడానికి డివిజన్లను విభజన చేశారని మండి పడ్డారు. ప్రజా క్షేత్రంలో కొట్లాడటం చేతకాక... ప్రత్యర్థులను ఎదుర్కోలేక డీ లిమిటేషన్ పక్రియలో కుట్రలు చేశారని ద్వజమెత్తారు.
కరీంనగర్ లో ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాదిస్తుందని...బీజేపి వైపే ప్రజలు ఉన్నారని భావించి ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుట్రలకు తెరలేపారని అన్నారు. నగరపాలక సంస్థ అశాస్త్రీయంగా విడుదల చేసిన డివిజన్ల విభజన ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, రాపర్తి విజయ, వంగల పవన్ కుమార్, కాసర్ల ఆనంద్ కుమార్, దుర్షేద్ అనుప్, బండ రమణారెడ్డి, తాడేపు చంద్రమౌళి, కొండపల్లి సతీష్, కొలిపాక శ్రీనివాస్, నాయకులు లోకేష్, శ్రీనివాస్, కార్యకర్తలుపాల్గొన్నారు.