04-01-2026 01:02:48 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం పెరుగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆందోళనవ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటిస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను పెంచుకున్నాయని తెలిపారు. తె లంగాణలో పిల్లల నియంత్రణ పూర్తి స్థాయిలో పాటించడం వల్ల జనాభా తగ్గిపోయే అవకాశం వచ్చిందని, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్నారు.
అందుకే ఇద్దరు పిల్లల నియంత్రణ ఎత్తివేస్తూ అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంలోని 21 (3) సెక్షన్ సవరణ బిల్ల్లుకు సభలో ఆమోదం లభించడం హర్షణీయమని మంత్రి సీతక్క తెలిపారు. సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. మున్సిపాటీలకు గతంలోనే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసి.. పంచాయతీలను వదిలేసిందని మంత్రి వివరించారు.
‘వీబీజీరామ్జీ’ని వెనక్కి తీసుకోవాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్)పై రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండా పేరు మార్చుతూ వీబీజీరామ్జీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. శనివారం శాసనమండలిలో స్వల్పకాలిక చర్చలో భాగంగా ఉపాధి హామీ చట్టంపై మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఉపాధిహామీ చట్టం కింద రాష్ట్ర వాటా రూ.532.13 కోట్లు కాగా, వీబీజీరామ్జీ కింద రాష్ట్ర వాటా రూ.2320.10 కోట్లుగా ఉందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 1787.97 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందన్నా రు. కేద్రం వంద రోజుల నుంచి 125 రోజులు పనిదినాలు చేశామని గొప్పలు చెప్పుకుంటుందని, కానీ కేం ద్రం అమలు చేసేది 75 రోజులే..మిగతా 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం పనికల్పించాల్సి ఉంటుందన్నారు.
ఎం జీఎన్ఆర్ఈజీఎస్ కింద వంద శాతం వేతన నిధులు, మెటీరియల్కింద 75 శాతం గతంలో కేంద్రమిచ్చేదని, కొత్త చట్టంతో కేంద్ర రాష్ట్రాల వాటా 60:40 శాతంగా చేయడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానం మండలిలో పలువురు సభ్యులు ఆమోదం తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లకు మంచి నిర్ణయం : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ల కు ఈ చట్టం సవరణ మంచి నిర్ణయ ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పినట్లుగా జ నాభా స్వీయనియంత్రణ వైపు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మధ్యే మార్గంగా ఉండే రూల్స్ను ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని ప్రభుత్వానికి సూచించారు.
రాజకీయ వెసులుబాటు కోసమే: బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయడమంటే రాజకీయ వెసులుబాటు కోసమేనని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. పార్లమెంట్లో కూడా ఇలాంటి చట్టాలు చేస్తే భారత్లో భూమి కరువై.. పక్క దేశాల్లోకి బతకాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరికి మించి పెంచలేని పరిస్థితి ఉందని, సాప్ట్వేర్ ఇంజినీర్లు ఒక్కరినే కంటున్నారని, లక్షల రూపాయాలు సంపాదించే వారే ఒకరికే పరిమితం అవుతుంటే..
గ్రామాల్లో ఉండి రూ. వేలల్లో సంపాదించే వారిని ఎంత మందినైనా కనండి అన్నట్లుగా ఈ చట్టం సవరణ ఉందన్నారు, గత ప్రభుత్వం మున్సిపల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం పంచాయతీల్లో ఎత్తివేయడం సరైంది కాదన్నారు.